Andrapradesh: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చేసిన సంక్షేమాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఆయన తాడేపల్లిలోని తన కార్యాలయంలో ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు.. వారికి దిశా నిర్దేశం చేశారు. ఏపీ ఎన్నికల ఫలితాలను చూసి ఎవరూ నిబ్బరాన్నికోల్పోవాల్సిన అవసరం లేదన్నారు. గడచిన ఐదేళ్లలో గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టోలో 99శాతం హామీలను నెరవేర్చామన్నారు. దేశంలో, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతలా.. ఒక పవిత్ రగ్రంధంలా భావించి అమలు చేశామన్నారు. మేనిఫెస్టోను చూపించి ప్రతి అక్కచెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటూ.. ఇది అమలు జరిగిందా? లేదా? అని అడిగి మరీ టిక్ పెట్టించామన్నారు.
ఏకంగా రూ.2.7 లక్షల కోట్లు ఎలాంటి లంచాలు, వివక్ష, అవినీతికి తావు లేకుండా అందించామన్నారు జగన్. ఏ నెలలో ఏమిస్తామో.. ప్రతి ఏటా క్యాలెండర్ విడుదల చేసి.. ఆ మేరకు మాట తప్పకుండా పథకాలు అమలు చేశామన్నారు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా.. విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజిక న్యాయం, మహిళాసాధికారిత, సుపరిపాలన విషయంలో ఎప్పుడూ జరగని, చూడని సంస్కరణలు అమలు చేశామన్నారు. చేసిన పనుల్ని ప్రజలకు చెప్పి.. వారి మన్ననలను పొందిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లామన్నారు.. ఎన్నికల్లో ఏమైందో తెలియదన్నారు. 2019 నుంచి 2024 వరకు ఐదేళ్లు ఇట్టే గడిచిపోయాయని.. అదే మాదిరిగా మళ్లీ 2024 నుంచి 2029 వరకు కూడా ఇదేళ్లు ఇట్టే గడుస్తాయన్నారు.
సినిమాలో ప్రస్తుతం ఫస్టాఫ్ మాత్రమే అయ్యిందని.. గతంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎలా పైకి లేచామో అందరికీ తెలుసన్నారు. ప్రజల్లో మనం చేసిన మంచి ఇప్పటికీ ఉందని.. ఇంటింటికీ చేసిన మంచి బ్రతికే ఉందన్నారు. ఈ ఐదేళ్ల పాలనపై విశ్వసనీయత ప్రజల్లో ఇప్పటికీ ఉందన్నారు. కాకపోతే కొంత సమయం పడుతుందని.. ఆ సమయం ఇవ్వాలన్నారు. ఆ సమయం ఇచ్చినప్పుడు.. వాళ్ల పాపాలు పండినప్పుడు కచ్చితంగా పైకి లేస్తామన్నారు. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలన్నారు.
రాజకీయాల్లో అన్నికంటే ముఖ్యమైన అంశం క్యారెక్టర్.. విలువలు, విశ్వసనీయత వంటి పదాలకు అర్థం తెలుసుకోవడం చాలా అవసరమన్నారు జగన్. రాజకీయాలంటే అధికారం మాత్రమే కాదని.. అధికారంలో లేనప్పుడు కూడా ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తారు.. ఎలా ఉంటారు అన్నది కూడా రాజకీయమే అన్నారు. అధికారంలో లేనప్పుడు కచ్చితంగా కష్టాలు వస్తాయని.. కానీ ఆ కష్టాలు వచ్చినప్పుడు ఎలా స్పందిస్తామన్నది అందరి చేతుల్లో ఉందన్నారు. కష్టాలు వచ్చినప్పుడు విలువలు, విశ్వసనీయతలేని మనిషిగా రాజకీయాలు చేద్దామా? లేక ఆ కష్టాలను ఎదుర్కొంటూ, హుందాగా నిలబడుతూ.. ముందడుగులు వేసి కష్టపడితే.. మళ్లీ అధికారంలోకి వస్తామా? అన్నది ఆలోచన చేయాలన్నారు.
అసెంబ్లీలో వైఎస్సార్సీపీ సంఖ్యా బలం పెద్దగా లేదని.. ఆ సభలో గొంతు విప్పే అవకాశం రాకపోవచ్చన్నారు.. గొంతు విప్పనివ్వకపోవచ్చన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్. కాని మండలిలో వైఎస్సార్సీపీకి బలం ఉందనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. 'మనల్ని ఎవరూ ఏమీ చేయలేరని'.. నాలుగు కేసులు పెట్టుగలుగుతారన్నారు. చంద్రబాబు హయాంలో చాలా త్వరగా పాపాలు పండుతాయి.. అందరి కళ్లముందే చంద్రబాబు పాపాలు ఎలా పండుతాయో గతంలో చూశామన్నారు. రాష్ట్రంలో రావణ కాష్టం సృష్టిస్తున్నారని.. విధ్వంసం చేస్తున్నారన్నారు. ఆస్తులకు నష్టం చేస్తున్నారని.. దాడులు చేస్తున్నారన్నారు. అమానుషంగా దాడులకు పాల్పడుతున్నారని.. ఇవన్నీ శిశుపాలుడి పాపాల మాదిరిగా మొదలయ్యాయన్నారు.
కేంద్రంలో ఇప్పుడు నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేవన్నారు జగన్. కేంద్రంలో 240 సీట్లకు అధికారపార్టీ పరిమితం కావడం, మరోవైపు రాష్ట్రంలో టీడీపీకి మంచి సంఖ్య రావడం, ఎన్టీయేలో కీలకంగా ఉన్న పరిస్ధితులు ఉన్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేకహోదాను అడగకపోవడం చంద్రబాబు చేసిన మరో పాపమని.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదాను అడగకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించరన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో సంక్షేమ పథకాలు ఇప్పుడు వస్తాయో, రావో తెలియని పరిస్థితి ఉందన్నారు.
రాబోయే రోజుల్లో ఈ పాపాలు పండుతాయని.. ఈ పాపాలన్నీ పండేదాకా.. ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదన్నారు జగన్. అందరం గట్టిగా నిలబడి, ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లగలిగేలా ప్రజల్లో నిరంతరం ఉండాలన్నారు. కష్టాలు రావడం సర్వ సహజం.. ఎదుర్కొని నిలబడటమే ముఖ్యమన్నారు. అసెంబ్లీలో వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తారో లేదా కూడా అనుమానమే అన్నారు. ఒక్క పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేట్టుగా నైతిక విలువలు పాటిస్తారా? లేదా? అన్నది సందేహమే అన్నారు.
హనీమూన్ పీరియడ్ ముగిసేవరకూ కూటమికి సమయం ఇద్దామని.. వైఎస్సార్సీపీ కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపే కార్యక్రమం చేద్దామన్నారు జగన్. రాబోయే రోజుల్లో ఇంకా సమయం గడిచే కొద్దీ ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు ముమ్మరం అవుతాయని.. ప్రజల్లోనే ఉంటాం.. ప్రజలతో కలిసి పోరాడే కార్యక్రమాలు రానున్న రోజుల్లో చేపడదామన్నారు. ఏకంగా 14 నెలలు పాదయాత్ర చేశాననని.. ఆ వయసు ఇప్పటికీ తనకు ఉందన్నారు. ఆ సమయం వచ్చేదాకా ఎమ్మెల్సీలుగా శాసనమండలిలో ఎవరి పాత్ర వారు పోషించాలన్నారు జగన్.